హత్యచేసి.. మూటగట్టి..

25 Apr, 2019 09:01 IST|Sakshi
ముళ్లపొదలో గన్నీ సంచి, గుర్తు తెలియని∙మహిళ మృతదేహం

సుల్తానాబాద్‌(పెద్దపల్లి):  మండలంలోని గట్టెపల్లి గ్రామ ఊరచెరువులో 28 ఏళ్ల గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుల్తానాబాద్‌ సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై రాజేశ్‌ కథనం ప్రకారం..ఈజీఎస్‌ కూలీలు బహిర్భూమికి వెళ్లగా ముళ్లపొదలనుంచి దుర్వాసన రావడం గమనించారు. మరింత దగ్గరకు వెళ్లి చూడగా గన్నీ సంచిలో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందిచగా..వారు సంఘటన స్థలానికి చేరుకొని ముళ్లపొదలో ఉన్న గన్నీ సంచిని పరిశీలించగా మహిళ మృతదేహం లభ్యమైంది.

మృతదేహంపై నైటీ మాత్రమే ఉండగా, కాళ్లను ప్లాస్టర్‌తో చుట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. తల, ఇతర భాగాలపై రక్తపు మరకలున్నాయి. దుండగులు మూడురోజుల క్రితమే మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా గట్టెపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి మృతదేహాన్ని చూశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు
సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, సోడా బాటిళ్లు ఉన్నాయి. మృతదేహం పడేసిన చోట కొంత దూరంలో వాహనం తిరిగి వెళ్లిన ఆధారాలున్నట్లు పోలీసులు తెలిపారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేయగా ఘటనా స్థలంనుంచి కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి.

మరిన్ని వార్తలు