పాత కక్షలతో మహిళ హత్య

19 Aug, 2018 07:12 IST|Sakshi
లక్ష్మి మృతదేహం

ఆసిఫాబాద్‌ (ఆదిలాబాద్‌): మండలంలోని ఇప్పల నవగాంలో శుక్రవారం అర్ధరాత్రి పాత కక్షలతో వివాహిత ఇంజరి లక్ష్మి హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన ఇంజరి బాపు, బద్ది రామయ్య గ్రామానికి చెందిన పటేల్‌ సోమయ్య వద్ద వ్యవసాయ పనులు చేసేందుకు రూ.10 వేలు అడ్వాన్సుగా తీసుకున్నారు. ఈ డబ్బుల్లో చెరో రూ.5 వేలు తీసుకున్నారు. ఈ క్రమంలో డబ్బులు తీసుకున్న మరుసటి రోజు నుంచి రామయ్య పనులకు వెళ్లడం లేదు. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించడం లేదు.

ఈ క్రమంలో తీసుకున్న డబ్బులు రామయ్య వారం రోజుల్లో తిరిగి చెల్లిస్తానని గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పుకుని చెల్లించలేదు, పనికి వెళ్లలేదు. దీంతో శుక్రవారం రాత్రి బాపు తన భార్య లక్ష్మితో కలిసి రామయ్య ఇంటికి వెళ్లాడు. విషయం మాట్లాడుతుండగా అక్కడే ఉన్న రామయ్య మేనల్లుడు ఆత్రం మహేశ్‌.. బాపు భార్య లక్ష్మి పొత్తి కడుపుపై పిడిగుద్దులు గుద్దుతూ, మెడ, తలపై దాడి చేశాడు. గొంతు నులిమి దాడి చేశాడు. దీంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు