భార్యపై అనుమానంతోనే హత్య

27 Apr, 2019 08:23 IST|Sakshi
నిందితుడు హరీశ్‌, రమ(ఫైల్‌)

రెండురోజుల్లోనే నిందితుడి పట్టివేత

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను చంపినట్లు పోలీసుల వద్ద నిందితుడు హరీశ్‌ అంగీకరించినట్లు పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్‌ తెలిపారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 24న గట్టెపల్లిలో గన్నిసంచిలో వివాహిత మృతదేహం లభ్యమైంది. కరీంనగర్‌లో ఫ్యాషన్‌ డిజైనర్‌గా రమ పని చేసిన సమయంలో శ్రీరాం చిట్స్‌లో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా  పని చేస్తున్న రేవెళ్లి హరీశ్‌తో పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకున్నారు. కరీంనగర్‌లోని హజ్మత్‌పురాలో ఆరీఫ్‌ ఇంట్లో అద్దెకు జాడి రమ అలియాస్‌ లక్కీఅలియాస్‌ సిరివెన్నెలతో కలిసి ఉంటున్నారు.

కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ రమ తరచూ ఫొన్లో మాట్లాడడాన్ని హరీష్‌ గమనించి తప్పుబట్టాడు. ఏప్రిల్‌ 7వ తేదీన తన భర్త వేధిస్తున్నాడని 100కి ఫోన్‌చేసి రమ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్‌ చేసి ఇంటికి పంపించారు. దీన్ని మనుసులో పెట్టుకొని హత్య చేసినట్లు హరీశ్‌ ఒప్పుకున్నాడని డీసీపీ వివరించారు. అక్రమ సంబంధం పెట్టుకుందని భావించి ఈనెల 21న అద్దెకుంటున్న ఇంట్లో గొంతు నులిమి హత్య చేసి తన ద్విచక్ర వాహనంపై గట్టెపల్లిలో గన్నిసంచిలో పడేసినట్లు అంగీకరించాడని వివరించారు.

సోషల్‌ మీడియాలో, పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలు మృతురాలి కుటుంబసభ్యులు అక్క రాధా, అన్న భానేశ్, ఇంటి యజమాని ఆరీఫ్‌ సుల్తానాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రెండురోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. రమది మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం నార్వ స్వగ్రామం. నిందితుడు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం పందిళ్ల గ్రామ నివాసి అని తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకటరమణారెడ్డి, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై రాజేశ్, పోలీస్‌ సిబ్బందిని డీసీపీ అభినందించారు.

మరిన్ని వార్తలు