భర్త దుబాయ్‌లో.. భార్య వివాహేతర సంబంధం

20 Jan, 2019 08:42 IST|Sakshi
 రెండురాళ్ల మధ్యలో బూడిదగా ఉన్న మృతదేహం

ప్రియుడి చేతిలో వివాహిత దారుణ హత్య

పోలీసుల అదుపులో నిందితుడు

టెక్కలి రూరల్‌: వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ భర్త దుబాయ్‌లో ఉండటంతో ప్రియుడిపై మోజు పడి తన సర్వాస్వాన్ని అర్పించిన వివాహిత పాలిట ఆ ప్రియుడే కాల యముడయ్యాడు. గ్రామం సమీపంలోని కొండల మధ్య పాశవికంగా ఆమెను కాల్చి బూడిద చేశాడు. దీంతో ఆమె ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిపోయారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ పరిధి బలరాంపురం గ్రామానికి చెందిన అన్నెపు కుశుమన్న, లక్ష్మి(34)లకు 15 ఏళ్ల క్రితం వివాహామైంది.

వీరికి యోగానందరావు(13) పాప ధనలక్ష్మి(8) ఉన్నారు. తాపీ పని చేసే ఆమె భర్త.. కొద్ది నెలల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లారు. ఇదిలా ఉండగా... అదే గ్రామానికి చెందిన సంపతిరావు భాస్కర్రావుతో మృతురాలికి ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్త కూడా స్థానికంగా లేకపోవడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే... ఇటీవల నిందితుడి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటంతో ఇరువురి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే భాస్కర్రావు.. లక్ష్మిని అంతమొందించి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.

బండరాళ్ల మధ్యలో..
మరోవైపు... తన సోదరి ఈ నెల 9వ తేదీ నుంచి కనిపించడం లేదని కోటబొమ్మాళి మండలం కమలనాథపురానికి చెందిన చింతాడ అప్పన్న 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో అదే గ్రామానికి చెందిన భాస్కర్రావు ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం లింగాలవలస పంచాయతీ పరిధిలోని కొండల సమీపంలో ఉన్న బండరాల మధ్య మనిషిని కాల్చిన విధంగా బూడిద కనిపించింది.

ఘటనా స్థలం, గ్రామస్తుల నుంచి మరిన్ని వివరాలు సేకరించిన పోలీసులు, నిందితుడిని విచారించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా... నిందితుడు అధికార పార్టీకి చెందిన కార్యకర్త అని.. అందుకే చేసిన హత్యను ఒప్పుకున్నప్పటికీ పోలీసులు సాయంత్రం వరకు ఘటన స్థలానికి రాలేదని, కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు