పేటేరులో నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య

15 May, 2019 12:13 IST|Sakshi
సంఘటన స్థలంలో నిర్మల మృతదేహం

డొక్కు నిర్మలను అతి కిరాతకంగా నరికి చంపిన శ్రీనివాసరావు

వివాహేతర సంబంధం కారణమంటున్న పోలీసులు

పరారీలో నిందితుడు

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

రేపల్లె(నగరం): పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపిన ఘటన రేపల్లె మండలం పేటేరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం జరిగింది. ఎస్‌ఐ రాజేశ్వరరావు తెలిపిన సమాచారం మేరకు పేటేరు గ్రామానికి చెందిన డొక్కు నిర్మల(46) మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసుకుని ఇంటికి వెళుతుండగా అదే గ్రామానికి చెందిన డొక్కు శ్రీనివాసరావు పంచాయతీ కార్యాలయం ఎదురుగా నడిరోడ్డుపై కత్తితో నిర్మలపై దాడి చేశాడు. నిర్మల భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసింది. అయినా శ్రీనివాసరావు వెంబడించి నిర్మలను మెడపై విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనలో నిర్మల అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించగా ఎస్‌ఐ రాజేశ్వరరావు, రూరల్‌ సీఐ అచ్చయ్య సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిర్మల మృతదేçహానికి పోలీసులు శవపంచనామా చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అచ్చయ్య తెలిపారు.

వివాహేతర సంబంధమే హత్యకు కారణం?
డొక్కు నిర్మల భర్త రెండేళ్ల క్రితం మృతి చెందాడు. అనంతరం నిర్మల శ్రీనివాసరావుతో  వివాహేతర సంబంధం పెట్టుకుందని, అయితే కొంతకాలంగా నిర్మల వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో  శ్రీనివాసరావు హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. మృతురాలికి రాజు అనే కుమారుడు ఉన్నాడు. అతను పీజీ చేస్తున్నాడు. నిర్మల హత్య జరిగే సమయంలో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడి చేసేందుకు శ్రీనివాసరావు యత్నించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.     సమాచారం తెలుసుకున్న బాపట్ల డీఎస్సీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు