ప్రియుడి కోసం యువతి పోరాటం

12 Mar, 2019 07:28 IST|Sakshi
ధర్నా చేస్తున్న కన్‌మణి

తమిళనాడు, అన్నానగర్‌: తనను ప్రేమించి మోసం చేసిన ప్రియుడితో వివాహం చేయించాలని కోరుతూ లాల్‌కుడి మహిళా పోలీస్‌స్టేషన్‌ ముందు యువతి ఆదివారం ధర్నా చేసింది. తిరుచ్చి జిల్లా సమయపురం ఇనామ్‌కల్‌ పాలైయమ్‌ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌ కుమారుడు వెంకటేష్‌ (28). ఇతను కేరళ రాష్ట్రం కొచ్చిలో ప్రైవేట్‌ సిమెంట్‌ కర్మాగారంలో సహాయ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. తంజావూర్‌ జిల్లా తిరువైయారు తేర్‌ముట్టి వీధికి చెందిన పన్నీర్‌ సెల్వం కుమార్తె కన్‌మణి(25) చెన్నైలో ఉన్న ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది.

కన్‌మణి అత్త కుమారుడు ధర్మరాజాకి వెంకటేష్‌ స్నేహితుడు. దీంతో డాల్మియాలో ఉన్న ధర్మరాజ్‌ ఇంటికి వెంకటేష్‌ తరచూ వచ్చేవాడు. ఆ సమయంలో అత్త ఇంటిలో ఉంటూ చదువుతున్న కన్‌మణి, వెంకటేష్‌ మధ్య పరిచయం ఏర్పడింది. 2010 నుంచి ఉన్న పరిచయం ప్రేమగా మారింది. తొమ్మిదేళ్లుగా ఇద్దరూ ప్రమించుకుంటున్నారు. తనను వివాహం చేసుకోమని వెంకటేష్‌ను కన్‌మణి ఒత్తిడి చేసింది. వెంకటేష్‌ ఒప్పుకోలేదు. మోసపోయానని గ్రహించిన కన్‌మణి, ఈ నెల 2వ తేది లాల్‌కుడి మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం లాల్‌కుడి మహిళా పోలీసు స్టేషన్‌కి వెళ్లిన కన్‌మణి పోలీసు స్టేషన్‌ ముందు బైఠాయించింది. వెంకటేష్‌తో వివాహం చేసిపెట్టాలని కోరుతూ ధర్నా చేసింది. చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇవ్వడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మరిన్ని వార్తలు