ప్రేమ, పెళ్లి పేరుతో వంచన

12 Dec, 2017 08:24 IST|Sakshi
ధర్నా చేస్తున్న నిర్మల,మహిళా సంఘాలు నాయకులు

మహిళా సంఘాల మద్దతుతో

ప్రియుడి ఇంటిముందు బాధితురాలి ధర్నా

దొడ్డబళ్లాపురం(రామనగర): ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ తన ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.  ఈఘటన రామనగర తాలూకా బసవనపురంలో  సోమవారం చోటు చేసుకుంది. బసవనపురం సమీపంలోని మధుర గార్మెంట్స్‌లో పనిచేస్తున్న నిర్మలకు వివాహమైంది. ఆమెకు  ఒక కుమారుడు ఉన్నాడు. అయితే భర్త నుంచి వేరుగా జీవిస్తోంది. ఈక్రమంలో  ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భరత్‌(30)అనే యువకుడితో పరిచయమై  ప్రేమగా మారింది.  ఇద్దరూ కొంత కాలం సహజీవనం చేశారు. 

భరత్‌కు పెద్దమొత్తంలో డబ్బు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే భరత్‌కు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో నిర్మలను వదిలి వెళ్లిపోయాడు. ఇదేం న్యాయమని ప్రశ్నించగా   కులం వేరని తన ఇంట్లోనివారు వివాహానికి ఒప్పుకోవడంలేదని సాకు చెప్పాడు. దీంతో నిర్మల మహిళా సంఘాలతో కలిసి భరత్‌ ఇంటి ముందు ధర్నా చేపట్టింది. మరో వైపు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

>
మరిన్ని వార్తలు