అబ్దుల్లాపూర్‌మెట్టులో అనూహ్య ఘటన!

15 Dec, 2019 13:08 IST|Sakshi

సాక్షి, అబ్దుల్లాపూర్‌ మెట్టు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో అనూహ్య ఘటన వెలుగుచూసింది. ఇసుక లోడ్‌లో గుర్తుతెలియని మహిళ పుర్రెతోపాటు శరీరభాగాలు లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సాహెబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం అబ్దుల్లాపూర్ మెట్టు నుంచి ఇసుకను కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. తన ఇంటి వద్ద ఇసుక వేస్తుండగా అందులో మహిళా పుర్రె  బయటపడింది. దీంతో కంగుతిన్న ఆయన పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌రెడ్డిని వెంట తీసుకొని వెళ్లిన పోలీసులు ఇసుక డంప్ వద్దకు క్లూస్ టీమ్‌తో తనిఖీలు చేశారు. దీంతో ఇసుక డంప్‌లో మరికొన్ని శరీరభాగాలు లభించాయి. మహుబూబ్ నగర్ జిల్లా నుంచి ఏడు నెలలు క్రితం ఇసుక డంప్ చేసినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. చనిపోయిన మహిళ వయసు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు