అత్తింటి వేధింపులకు వివాహిత బలి

4 Jun, 2018 11:32 IST|Sakshi
మృతి చెందిన లావణ్య చికిత్స పొందుతున్న అక్షిత బతికి బయటపడ్డ శ్రీతిన్‌

ఇచ్చోడ(బోథ్‌): అత్తంటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన వివాహిత యర్వ సుమలత అలియాస్‌ లావణ్య (30) ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కూతురు అక్షిత(7), కూమారుడు శ్రీతిన్‌(4)లకు సూపర్‌ వాస్మోల్‌ ఇచ్చి తానూ తాగింది. రిమ్స్‌లో చికిత్స పొందుతూ సుమలత మరణించగా అక్షితను హైదరాబాద్‌ తరలించారు. మృతురాలు బంధువులు, ఎస్సై ఎల్‌.రాజు తెలిపిన వివరాలివీ.. జగిత్యాల జిల్లా మెట్‌పెల్లికి చెందిన లావణ్యకు ఇచ్చోడ మండలం బోరిగామకు చెందిన మోహన్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహామైంది.

రెండేళ్ల క్రితం మోహన్‌ బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లి ఇటీవల తిరిగొచ్చాడు. కాగా రెండేళ్లుగా మోహన్‌ తల్లి వెంకటమ్మ, అడపడుచూ జ్యోతి అలియాస్‌ పెద్ద బూదాయిలు లావణ్యను మానసికంగా వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి శుక్రవారం తిరిగి వచ్చింది. వచ్చి రాగానే అత్త, అడపడుచు, భర్తతో గొడవ జరిగింది. తీవ్ర మనస్థాపం చెందిన లావణ్య ఇంట్లో ఉన్న సూపర్‌వాస్మోల్‌ ఇద్దరు పిల్లలకు ఇచ్చి తానూ తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే 108లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి అక్షిత పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. శ్రీతిన్‌ పరిస్థితి ఫర్వాలేదని ఎస్సై తెలిపారు. మృతురాలు అన్న అంజిత్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు