కోరిక తీర్చాలంటూ టీడీపీ నేత ఒత్తిడి

11 Feb, 2020 04:54 IST|Sakshi

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘటన

తాడేపల్లి రూరల్‌ (మంగళగిరి): తనను సుఖపెట్టాలంటూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో తట్టుకోలేక ఓ మహిళ సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి నాగమల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లి బ్రహ్మానందపురంలో నివాసం ఉండే వలపర్ల నాగరాజుకు మంగళగిరికి చెందిన సుజాతతో 2014లో వివాహమైంది. నాగరాజు ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గత రెండు నెలల నుంచి వీరు అద్దెకు ఉంటున్న ఇంటి పక్కన ఉండే టీడీపీ నాయకుడు సత్యాల బాలశౌరి సుజాతతో మీకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఇప్పిస్తాను.. నా కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు.

సుజాత ఒప్పుకోకపోవడంతో ‘నువ్వు చనిపోయేలోపు నిన్ను అనుభవిస్తాను, నిన్ను నీ భర్తతో కాపురం చేయనివ్వను’ అంటూ బెదిరించాడు. ఆదివారం రాత్రి సుజాత భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి కోరిక తీరుస్తావా లేదా? అంటూ బలవంతపెట్టడంతో సుజాత కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేసరికి బాలశౌరి అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతరం మనస్తాపంతో సుజాత ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందినట్లు సుజాత తల్లి నాగమల్లేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. బాలశౌరి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చైర్మన్‌ పదవిలో ఉంటూ కొంతమంది మహిళలను ఇలాగే వేధించినట్లు ఆరోపణలున్నాయి.

రౌడీషీటర్‌తో రాజీ మంతనాలు: సుజాత తల్లిదండ్రులు మంగళగిరిలో ఉండటంతో, అక్కడే ఉంటున్న మాజీ రౌడీషీటర్‌తో రాజీకి రావాలంటూ బాలశౌరి మంతనాలు ప్రారంభించాడు. సుజాత ఆత్మహత్య అనంతరం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలశౌరి టీడీపీ నేతల ఇళ్లలో దాక్కుని రాజీ ప్రయత్నాలు చేస్తున్నాడని సుజాత బంధువులు ఆరోపిస్తున్నారు. రాజీకి రాకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు.

మరిన్ని వార్తలు