అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

22 Apr, 2019 13:15 IST|Sakshi
మృత దేహాన్ని పరిశీలిస్తున్న సీఐ నరసింహరాజు, ఎస్‌ఐ చిన్నపెద్దయ్య

అత్త,మామలే కొట్టి చంపారంటూ మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు

వైఎస్‌ఆర్‌ జిల్లా  , చిన్నమండెం: చిన్నమండెం బస్టాండు సమీపంలోని బీసీ కాలనీలో దేరంగుల గంగాదేవి అలియాస్‌ పఠాన్‌ ఆప్‌ఖాన్‌ సమీరా(19) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ కె.చిన్నపెద్దయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు చిత్తూరు జిల్లా కలిచర్ల మండలం తాటిమాకులపల్లికి చెందిన దేరంగుల రామచంద్ర, కుమారిల కుమార్తె  గంగాదేవి 11 నెలల క్రితం చిన్నమండెం మండలానికి చెందిన పఠాన్‌ అమీర్‌ ఖాన్‌ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే 5 నెలల నుంచి అనారోగ్యం కారణంగా ఆమె మదనపల్లెలోని తల్లిదండ్రుల వద్ద ఉండేది. ఇటీవల చిన్నమండెంలోని తన అత్తవారింటికి వచ్చింది. శనివారం కలిచర్లలో జరిగే తిరునాలకు వెళ్లాలని తన భర్తకు తెలపడంతో ఇక్కడ పెద్దల పండుగ ఉంది. అది అయిన తర్వాత వెళదామని అతను చెప్పాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గంగాదేవి ఉరి వేసుకుని మృతి చెందినట్లు  ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే వారు చిన్నమండెంకు చేరుకున్నారు. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, అత్త, మామ కొట్టి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సీఐ నరసింహరాజు, ఎస్‌ఐ కె.చిన్నపెద్దయ్యలు సంఘటన స్థలాని పరిశీలించారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు