ప్రముఖ కంపెనీ పేరిట లోగో
లోపల అంతా ఖాళీనే...!
వీధుల్లో విక్రయిస్తున్న మహిళలు
చిట్టినగర్(విజయవాడవెస్ట్): సార్ పవర్ బ్యాంక్ హోనా.. రూ. 8 వందలది.. నాలుగు వందలకే ఇస్తాం.. సార్.. మేము ఢిల్లీలో కంపెనీ నుంచి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఇలా తిరుగుతూ అమ్ముకుంటాం సార్.. అంటూ ఆ మహిళలు నకిలీ పవర్ బ్యాంక్లను విక్రయిస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... ప్రతి నిత్యం తమ మాటల చాతుర్యంతో వందల సంఖ్యలో పవర్ బ్యాంక్లను ఫోన్ వినియోగదారులకు అంటకడుతున్నారు. అయితే మార్కెట్లో వేల రూపాయలలో ఉండే పవర్ బ్యాంక్ తక్కువ ధరకు వస్తుందని చెప్పి వెనుక ముందు ఆలోచించకుండా వందలాది రూపాయలు పెట్టి పవర్ బ్యాంక్లను కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత ఆ పవర్ బ్యాంక్ను పరిశీలిస్తే అందులో కేవలం సాదారణ మొబైల్ ఫోన్లో ఉండే తక్కువ రకం బ్యాటరీ ఉంటుంది. అంతా కలుపుకుంటే రూ.50 లోపే ఉంటుంది.
గుట్టు రట్టు చేసిన పోలీసులు.....
ముగ్గురు.. నలుగురు మహిళలు ఇటువంటి పవర్ బ్యాంక్లను విక్రయిస్తూ శుక్రవారం పంజా సెంటర్, చిట్టినగర్, సాయిరాం థియేటర్, పాలప్రాజెక్టు మీదగా కబేళా సెంటర్కు చేరుకున్నారు. అయితే నైనవరం ఫ్లై ఓవర్ వద్ద పోలీసు సిబ్బంది ఈ పవర్ బ్యాంక్లను విక్రయిస్తున్న మహిళల మాటలపై అనుమానంతో వాటిని పరిశీలించారు. చివరకు అవి నకిలీవి అని తేలడంతో భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. శుక్రవారం ఒక్క రోజు వీరు సుమారు రెండు వందలకు పైగా ఈ నకిలీ పవర్ బ్యాంక్లను విక్రయించినట్లు చెబుతున్నారు.