చందానగర్: ఉరివేసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ఎండీ అహ్మద్ పాషా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన గడ్డం సులోచన(38) వెంకటేశ్వరరెడ్డి దంపతులు ఈ నెల 11న శేరిలింగంపల్లి, బాపూనగర్లో ఉంటున్న సులోచన చిన్నమ్మ ఇంటికి ఈ నెల 11న వచ్చింది. గత కొంతకాలంగా బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న సులోచన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించగా, పరీక్షించిన వైద్యులు ఈ నెల 17న ఆపరేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో సర్జరీ చేయించుకునేందుకు భయపడిన గురువారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో మరొకరు..
సికింద్రాబాద్: భర్త నుంచి విడిపోవడం, ఆర్థిక సమస్యలతో మనస్తాపానికిలోనైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీతాఫల్మండి డివిజన్ బీదలబస్తీకి చెందిన పద్మావతి అలియాస్ కీర్తికి 8ఏళ్ల క్రితం సురేశ్తో వివాహం జరిగింది. ఆమెకు ఒక కుమారుడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో జీవితంపై విరక్తి చెందిన పద్మావతి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.