రాణా కపూర్‌కు ఈడీ భారీ షాక్‌

9 Jul, 2020 17:04 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

 యస్‌ బ్యాంకు కుంభకోణం : వేల కోట్ల ఆస్తులు ఎటాచ్‌

సాక్షి, న్యూఢిల్లీ: యస్ బ్యాంకు కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న యస్‌  బ్యాంకు  వ్యవస్థాపకుడు రాణా కపూర్, డిహెచ్ఎఫ్ఎల్ దివాలా ప్రమోటర్లు కపిల్ , ధీరజ్ వాధవన్ లకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్‌ చేసింది.  వీటి విలువ 2,203 కోట్ల రూపాయలని  గురువారం అధికారులు ప్రకటించారు. ఇందులో రాణా కపూర్‌ విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని తెలిపారు.  (యస్‌ బ్యాంక్‌ కేసు : వాధవాన్‌ సోదరుల అరెస్ట్‌)

మనీలాండరింగ్ నిరోధక (పీఎంఎల్‌ఏ)చట్టం ప్రకారం ముంబైలోని పెద్దార్ రోడ్‌లో ఉన్న ఒక బంగ్లా, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని ఆరు ఫ్లాట్లు, ఢిల్లీలోని అమృత షెర్గిల్ మార్గ్ వద్ద  ఉన్న 48 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటితోపాటు న్యూయార్క్‌లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, లండన్‌లో రెండు కమర్షియల్‌ ప్రాపర్టీస్‌తోపాటు ఐదు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. కాగా యస్‌ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి రాణా కపూర్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటికే క్రిమినల్ కేసులను నమోదు చేశాయి. కపూర్, అతని కుటుంబ సభ్యులు, ఇతరులు 4,300 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ఆరోపించింది.  రాణా కపూర్‌ క్విడ్‌ప్రోకో కింద డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా పలు సంస్ధలకు భారీగా రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ చార్జిషీట్‌లో  పేర్కొంది. మార్చిలో అరెస్టు  అయిన కపూర్, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు