లవర్‌ను తిట్టాడని చంపేశాడు

13 Oct, 2017 10:51 IST|Sakshi

ఒక్క క్లూ దొరకకుండా హత్య

కాల్స్‌ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు

సీసీ ఫుటేజీ ద్వారా హంతకుల పట్టివేత

వీడిన చందు హత్య మిస్టరీ

ఏడాది పాటు కొనసాగిన దర్యాప్తు

సాక్షి, వరంగల్‌: తన లవర్‌ను తిట్టిన వ్యక్తిని ఓ ప్రేమికుడు దారుణంగా హత్య చేశాడు. హత్య జరిగిన స్థలంలో ఒక్క క్లూ కూడా లభించకుండా జాగ్రత్త పడ్డాడు. మర్డర్‌ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ఏడాది పాటు శ్రమించారు. లక్షలాది ఫోన్‌కాల్స్‌ డేటాను విశ్లేషించారు. హంతకులను అధునాతన టెక్నాలజీ సాయంతో మడికొండ పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది పాటు జరిగిన దర్యాప్తులో చివరికి నిందితులకు సంకెళ్లేశారు.

చందు మర్డర్‌ మిస్టరీ..
2016 సెప్టెంబర్‌ 14న భట్టుపల్లి కోటచెరువు దగ్గర జరిగిన పులిగిల్ల చందు (19) హత్య కేసును మడికొండ పోలీసులు చేధించారు. ఏడాది పాటు జరిగిన దర్యాప్తు వివరాలను కాజీపేట అసిస్టెంట్‌ కమిషనర్‌ జనార్ధన్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత ఏడాది వినాయక నిమజ్జనం రోజున కాజీపేట మండలం భట్టుపల్లి కోట చెరువు వద్ద చందు హత్య జరిగింది. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఘటనా స్థలంలో పోలీసులకు లభించలేదు.

విచారణ ఇలా...
చందు హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ కేసులో ఒక్కో చిక్కుముడి విప్పుతూ నిందితులను పట్టుకున్నారు. ముందుగా 2016 సెప్టెంబర్‌ 14న దర్గా కాజీపేటలో ఉన్న సెల్‌ఫోన్‌ టవర్ల పరిధిలో వచ్చి పోయిన కాల్స్‌ వివరాలు సేకరించారు. ఇందులో అనుమానాస్పదంగా అనిపించిన 12 మందిని గుర్తించి, అనుమానితుల కాల్‌ డేటా రికార్డు (సీడీఆర్‌) జాబితా ఆధారంగా విచారణ చేపట్టగా వారికి ఈ కేసుతో ఏ సంబంధం లేదన్నట్లు తేల్చారు.

టవర్‌ లొకేషన్‌..
కేసు విచారణకులో భాగంగా పోలీసులు టవర్‌ లొకేషన్‌ టెక్నాల జీని ఆశ్రయించారు. మృతదేహం లభ్యమైన ఘటనా స్థలంలో హత్య జరిగినట్లుగా భావిస్తున్న సమయంలో అక్కడున్న టవర్‌ లొకేషన్‌ మ్యాప్‌ను సెల్‌ఫోన్‌ ఆపరేటర్ల నుంచి తెప్పించారు. దీంట్లో హత్య జరిగిన సమయంలో, ఘటనా స్థలానికి కేవలం 200 మీటర్ల దూరంలో కేవలం గుగులోతు శివ అనే వ్యక్తి ఫోన్‌ సిగ్నల్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించడగా తానూ, తన స్నేహితుడు రెడ్డిమళ్ల రాంకీ కలిసి ఈ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు.

దీంతో అనుమానితుల ఆ సమయంలో వివిధ రకాల నెట్‌వర్క్‌ల నుంచి ఎవరెవరివితో మాట్లాడారు. ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆ రోజు నిందితులు ఉపయోగించిన హోండా అక్సెంట్‌ కారు వివరాలు తీసుకున్నారు. నిందితులు రాంకీ, గుగులోతు శివను అరెస్ట్‌ చేసి, కారు ను, హత్యకు వాడిన ఇనుప చువ్వను  స్వాధీ నం చేసుకున్నారు. కేసులో ప్రతిభ కనపరిచిన మడికొండ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్, సిబ్బంది దేవేందర్, సాం బయ్య, కె.కిషన్, రవి, శ్రీకాంత్‌ను ఏసీపీ అభినందించారు.  

లవర్‌ను తిట్టినందుకే..
వర్ధన్నపేటకు చెందిన రెడ్డిమల్ల రాంకీ, పాలకుర్తిలో ఇరిగేషన్‌ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. దర్గా కాజీపేటలో ఉండే అతడి బావ కనుమల్ల కిరణ్‌ ఇంటికి వచ్చే క్రమంలో అక్కడే ఉండే ఓ యువతితో రాంకీ ప్రేమలో పడ్డాడు. వినాయక నిమజ్జనం రోజున నిర్వహించిన కార్యక్రమంలో రెడ్డిమల్ల రాంకీ అతడి లవర్‌ ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. అక్కడే ఉన్న పులిగిల్ల చందు రాంకీ లవర్‌ను కామెంట్‌ చేశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.

పకడ్బందీగా..
రాంకీ, దర్గా కాజీపేటలో ఉండే గుగులోతు శివ అనే తన స్నేహితుడి ద్వారా పుల్లిగిల్ల చందును పిలిచాడు. ముగ్గురు కారులో వర్ధన్నపేట వరకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ముగ్గురూ మద్యం సేవించారు. అనంతరం కారు నడుస్తుండగానే రెడ్డిమల్ల రాంకీ తనతో తెచ్చుకున్న పదునైన ఇనుప చువ్వతో చందు మెడ, గొంతు భాగంలో విచక్షణరహితంగా పొడిచి చంపాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత భట్టుపల్లి కోటచెరువు మత్తడి పక్కనే ముళ్ల పొదల్లో మృతదేహాన్ని పడేసి వెళ్లారు.

మరిన్ని వార్తలు