ఓ ఇష్టంలేని పెళ్లి.. కిడ్నాప్‌.. అరెస్ట్‌!

29 Feb, 2020 17:13 IST|Sakshi
యువతి బంధువుల దాడిలో ధ్వంసమైన కారు

సాక్షి, ప్రకాశం : జిల్లాలో కిడ్నాప్‌ కలకలం రేగింది. ఓ హోటల్‌ రూములో దిగిన నలుగురు యువకులు, యువతిపై దాడి చేసిన కొందరు యువతితో పాటు ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. అయితే కొద్ది సేపట్లోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన ఒంగోలులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సంగీత అనే యువతికి ఏడాదిన్నర క్రితం మేనమామతో వివాహమైంది. అయితే మేనమామతో వివాహం ఇష్టం లేక ఆమె ఇంటి నుండి పరారైంది. ఫేస్ బుక్‌లో పరిచయమైన చిత్తూరుకు చెందిన మనోజ్ దగ్గరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సంగీత, మనోజ్‌లు ఒంగోలులో ఉన్నారని తెలుసుకున్న ఆమె బంధువులు వారు ఉంటున్న హోటల్‌ రూం దగ్గరకు చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో రూములోకి ప్రవేశించి లోపల ఉన్న మనోజ్‌, సంగీతలతో పాటు మరో ముగ్గరు యువకులను చితకబాదారు.


సంగీత ఆదార్‌ జిరాక్స్‌, హోటల్‌ రిజిస్ట్రేషన్‌ కార్డు

ఆ దాడితో ముగ్గురు యువకులు అక్కడి నుండి పరారయ్యారు. ఆమె బంధువులు మనోజ్‌ పాటు సంగీతని బలవంతంగా ఓ కారులో ఎక్కించారు. అదే సమయంలో హోటల్ బయట ఉన్న యువకుడు మనోజ్‌కి చెందిన ఇన్నోవా కారుపై దాడి చేశాడు. కారు అద్దాలను ధ్వంసం చేశాడు. అనంతరం వారు అక్కడినుంచి ఆగమేఘాల మీద పరారయ్యారు. ఏం జరుగుతుందో తెలియక హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మద్దిపాడు వద్ద యువతీ, యువకుడిని తీసుకెళ్తున్న కారుని పట్టుకున్నారు. అందరినీ ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

మరిన్ని వార్తలు