ఫోన్‌ నంబర్‌ అడిగాడు.. చెంప చెళ్లుమనిపించింది

7 Apr, 2018 17:59 IST|Sakshi

రోహ్‌తక్‌ : తనను వేధించిన పోలీసును ఈడ్చుకుంటూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ రెండు చెంపలు వాయించేసింది ఓ అమ్మాయి. ఈ ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన నేహా జాంగ్రా నేషనల్ లెవల్ కరాటే ప్లేయర్‌గా గోల్డ్ మెడల్ సాధించింది.  శుక్రవారం సాయంత్రం కరాటే క్లాసులు ముగించుకుని ఇంటికి బయల్దేరింది. షేర్‌ ఆటోలో ప్రయాణిస్తుండగా పక్కనే కూర్చున్న ఓ ట్రాఫిక్ పోలీసు ఆమెను ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ అడిగాడు. తనతో స్నేహం చేయాలంటూ బలవంతం చేశాడు.  

దీంతో వేధింపులకు విసుగెత్తిన నేహా ఆటో డ్రైవర్‌ సాయంతో ఆ పోలీసును లాక్కెళ్లి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతటితో వదిలిపెట్టకుండా మహిళా పోలీసుల ముందే అతడి రెండు చెంపలూ చెళ్లుమనిపించింది. అయితే ట్రాఫిక్ పోలీసుపై చర్యలు తీసుకోవద్దంటూ మహిళా పోలీసుకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు బాధితురాలు ఆరోపించింది. కాగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌ ను ఇప్పటికే సస్పెండ్ చేశామనీ.. రాతపూర్వక ఫిర్యాదు అందిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని రోహ్‌తక్ డీఎస్పీ రవీంద్ర పేర్కొన్నారు. అంతేకాక దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని  డీఎస్పీ అన్నారు.

మరిన్ని వార్తలు