దుస్తులు కొనివ్వలేదని యువతి ఆత్మహత్య

23 Aug, 2018 12:03 IST|Sakshi
మృతిచెందిన రెడ్డి షమియా

చిత్తూరు అర్బన్‌: జిల్లాలోని ముస్లింలందరూ బుధవారం బక్రీద్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిత్తూరు నగరంలోని ప్రశాంత్‌నగర్‌ కాలనీలోని మహబూబ్‌బాషా ఇంటిలో మాత్రం విషాదం నెలకొంది. బక్రీద్‌ పండుగకు కొత్త దుస్తులు కొనివ్వలేదని మనస్తాపం చెందిన అతని పెద్ద కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. టూటౌన్‌ పోలీసుల కథనం మేరకు.. ప్రశాంత్‌నగర్‌ కాలనీకి చెందిన మహబూబ్‌బాషకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పెద్ద కుమార్తె రెడ్డి షమియా (18) నగరంలోని కొంగారెడ్డిపల్లెలో ఉన్న ఓ డిగ్రీ కళాశాలలో బీకామ్‌ చదువుతోంది. బుధవారం బక్రీద్‌ పండుగ వస్తుందని కొత్త బట్టలు కావాలని తల్లిని అడిగింది. లారీకి వెళ్లిన తండ్రి రాగానే కొనిస్తాడంటూ తల్లి కాస్త గట్టిగా చెప్పింది. దీంతో తల్లిపై అలిగిన రెడ్డి షమియా మంగళవారం రాత్రి ఇంటి పైకప్పుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.  టూటౌన్‌ ఎస్‌ఐ నరేంద్ర అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు