సాక్షి, బనశంకరి: విద్యావంతురాలైన ఓ యువతి ప్రియుడితో జల్సాలు చేసేందుకు అవసరమైన డబ్బు కోసం చోరీలను వృత్తిగా ఎంచుకొని చివరకు కటకటాలపాలైంది. పీజీ హాస్టళ్లలో ల్యాప్టాప్లను తస్కరిస్తున్న యువతిని శనివారం మైకోలేఔట్ పోలీసులు అరెస్ట్ చేసి రూ.4 లక్షల విలువైన 10 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణవిభాగ డీసీపీ బోరలింగయ్య శనివారం వివరాలు వెల్లడించారు. చింతామణి తాలూకా చిలకలనేర్పుకు చెందిన శోభ(23) డిప్లొమా పూర్తిచేసి బెంగళూరులోని మైకోలేఔట్కు చేరుకుంది.
నగరంలోని మహిళా పీజీ హస్టళ్లను సందర్శించి యజమానులను పరిచయం చేసుకొని తనకు వసతి కల్పించాలని విన్నవించేది. యజమానులు గదులు చూపించే సమయంలో అక్కడి ల్యాప్టాప్లను తస్కరించి ఉడాయించేది. ల్యాప్టాప్లు చోరీకి గురైన ఘటనలు అధికం కావడంతో సీఐ అజయ్ తన సిబ్బందితో కలిసి విస్తృతంగా గాలింపు చేపట్టి సదరు కిలేడీని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండా సదరు కిలేడీ చోరీలకు పాల్పడటం ప్రియుడికి తెలియదని పోలీసులు తెలిపారు.