మంచిర్యాలక్రైం: మంచిర్యాల పట్టణంలో అక్కాచెల్లెళ్ల మధ్య సెల్ఫోన్ కోసం జరిగిన గొడవ అక్క ఆత్మహత్యకు కారణమైంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కంభం దామోదర్రెడ్డి పెద్ద కూతురు సుచిత (19) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. శనివారం రాత్రి ఆమె తన చెల్లెలు హాసినితో కలసి ఇంట్లో సెల్ఫోన్ చూస్తుండగా.. ఫోన్ తనకే ఇవ్వాలంటూ చెల్లెలు గొడవ పడింది. ఇది గమనించిన తండ్రి ఇద్దరు కూతుళ్లను మందలించారు. పరీక్షలు వస్తున్నాయని, చదువుకోవాలని చీవాట్లు పెట్టారు.
దీంతో మనస్తాపం చెందిన సుచిత తల్లిదండ్రులతో గొడవపడి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఆమె కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఫ్లై ఓవర్ బ్రిడ్జికి కొంత దూరంలో రైలుపట్టాల పక్కనే సుచిత మృతదేహం కనిపించింది. రైలు కింద పడి సుచిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని హెడ్కానిస్టేబుల్ సత్తయ్య తెలిపారు.