మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
రాయగడ : రాయగడ జిల్లా మునిగుడ పోలీస్స్టేషన్ పరిధిలోని హటొమునిగుడ గ్రామానికి చెందిన సుస్మితమహనందియా(17) అనే యువతి గ్రామానికి దగ్గరలోని బురిజిగుడ అడవిలో సగం కాలిపోయి పడి ఉంది. సగం కాలి ఉన్న యువతి మృతదేహాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. హటొమునిగుడకు చెందిన సుస్మిత మహనందియా ఈనెల 24వతేదీ నుంచి కనిపించడం లేదు.
దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గాలిస్తున్న పోలీసులకు బురిజిగుడ అడవి ప్రాంతంలో కాలిపోయి పడి ఉన్న సుస్మిత మృతదేహం కనిపించింది. ఆమె సగం కాలిపోయి మృతిచెంది శరీరం కుళ్లిపోయి ఉంది. పోలీసులు వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారంతా సంఘటనా స్థలానికి వచ్చి భోరున రోదించారు.
సుస్మితమహనందియాకు ఎటువంటి ప్రేమ, ఇతర వ్యవహారాలు లేకపోయినప్పటికీ ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. గుర్తుతెలియని దుండగులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసి కాల్చివేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? కుటుంబసభ్యులు ఎవరైనా ఈ పని చేశారా అన్నది విచారణలో తెలియాల్సి ఉంది.