కుల వివాదం: వ్యక్తి దారుణ హత్య

1 Jun, 2020 10:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై : కుల కక్షల కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 35 కత్తి పోట్లతో యువకుడి శరీరాన్ని చిధ్రం చేసి, తలను మొండెంనుంచి వేరు చేసి దారుణంగా ప్రవర్తించారు దుండగులు. ఈ సంఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తూత్తుకుడి జిల్లా, కీల కీరనుర్‌ గ్రామంలో ఎక్కువగా ఓ వర్గానికి చెందిన ప్రజలు జీవిస్తుంటారు. గత సంవత్సరం వేరే కులానికి చెందిన వ్యక్తిని మెజార్టీ వర్గానికి చెందిన వారి శ్మశాన వాటికలో పూడ్చటానికి ప్రయత్నించారు. ఇందుకు సదరు వర్గం ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో సత్యమూర్తి అనే 22 ఏళ్ల యువకుడు వారిని ఎదురించి చనిపోయిన వ్యక్తిని అక్కడే పూడ్చేలా చేశాడు. ఆ సమయంలో మెజారిటీ వర్గానికి సత్యమూర్తికి మధ్య చిన్న గొడవ కూడా జరిగింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లలేదు. గత శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సత్యమూర్తి రాత్రి 9గంటలు దాటినా తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అతడి కోసం అన్వేషణ ప్రారంభించారు. ( ప్రేమ పెళ్లి.. అమ్మను కొట్టొద్దు నాన్నా..)

ఊరికి దూరంగా అర కిలోమీటరు దూరంలో అతడి తల లేని మృత శరీరం కనిపించింది. దాదాపు 35 కత్తిపోట్లతో శరీరం మొత్తం ఛిన్నాభిన్నమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించటానికి ప్రయత్నించగా గ్రామస్తులు ఒప్పుకోలేదు. తల లేని శరీరాన్ని ఎలా తీసుకెళతారంటూ ప్రశ్నించారు. నిరసనలు సైతం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ.. తల దొరుకుతుందని, హంతకుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహం దొరికిన ప్రదేశానికి 400 మీటర్ల దూరంలో తలను గుర్తించారు పోలీసులు. ఆ వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఏ క్షణమైనా అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు గ్రామంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ( పగబట్టిన ప్రేమ; సాఫ్ట్‌వేర్‌ యువతికి..!)

మరిన్ని వార్తలు