ప్రేమ వ్యవహారం.. యువకుడి దారుణ హత్య

3 Apr, 2018 17:48 IST|Sakshi

కిరాతకంగా చంపిన దుండుగులు

కోర్టుకెళ్లి తిరిగిరాని లోకాలకు..

ఖాజీపల్లి వద్ద ఘటన

సాక్షి, మెదక్‌‌: ఓ యువకుడిని దుండగులు ముఖంపై బండరాయితో కొట్టి అతికిరాతకంగా చంపేశారు. ఈ ఘటన మెదక్‌ మండలం ఖాజీపల్లి గ్రామశివారులో మంగళవారం చోటుచేసుకుంది.  ప్రేమించిన పాపానికి ఇంత కిరాతకంగా చంపేస్తారా..? అంటూ మృతుడి బందువులు రోదించిన తీరు అందరిని కలచివేసింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. మెదక్‌ పట్టణం దాయర వీధికి చెందిన మహ్మద్‌ గఫ్పర్‌ ఖాన్‌- ఆసియాలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడైనా మోహీన్‌ఖాన్‌(22) మెదక్‌-చేగుంట ప్రధాన రహదారి పక్కన ఖాజీపల్లి గ్రామశివారులో దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు.

ప్రేమనే హత్యకు కారణమని అనుమానం..
అతనిపై కత్తితో దాడిచేసి, ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా బండరాయితో కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను మోహిన్‌ఖాన్‌ ప్రేమించి మరొక ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లడంతో ఆ బాలికను తీసుకొచ్చి అప్పగించినట్లు చెప్పారు.

కోర్టుకెళ్లి తిరిగిరాని లోకాలకు..
ఈ విషయంలో మోహీన్‌పై గతంలో కేసు నమోదు అయింది. దీనికి సంబంధించి మెదక్‌ కోర్టులో సోమవారం పేషిక హజరై రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ బస్‌లో తిరుగపయనమయ్యాడని మృతుడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. కానీ రోడ్డు పక్కనే దుండగుల చేతిలో కిరాతకంగా హత్యకు గురికావడం పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన కొద్ది దూరంలోనే ఏపీ13జి 7809 ఇండికా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రేమించినందుకు చంపేసి ఉంటారిని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది వరకు మోహీన్‌పై హత్యాయత్నం, అత్యాచారం కింద రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మెదక్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌టీం బృందం కూడా పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు