పురుగులమందు తాగి ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య
నమ్ముకున్న వారిని మోసం చేస్తున్నానంటూ సూసైడ్నోట్
చేవెళ్ల మండలం దేవునిఎర్రవల్లిలో విషాదం
సాక్షి, చేవెళ్ల : నా చావుకి కారణం నేనే.. చనిపోయి ఏమి సాధించలేం అని తెలిసికూడా ఈ పనిచేస్తున్నాను... నన్ను నమ్ముకున్న వారికి చాలామోసం చేస్తున్నాను.. సారీ అంటూ సూసైడ్నోట్ రాసి సొంత పొలంలోనే పురుగులమందు తాగి ఓ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతు శేరి గోపాల్రెడ్డికి ఇద్దరు కొడుకులు చిన్నకొడుకు శేరి హరీశ్వర్రెడ్డి, (24) హైదరాబాద్లో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. సెలవులు, పండుగలప్పుడే ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.
శివరాత్రి పండుగకు ఇంటికి వచ్చిన హరీశ్వర్రెడ్డి ఆదివారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన తన స్నేహితులకు ఫోన్చేసి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తుడు వెంకట్రెడ్డి విద్యార్థి తండ్రి గోపాల్రెడ్డికి చెప్పటంతో అందరూ కలిసి అతనికోసం వెతికారు. ఫోన్చేస్తే రింగ్ అవుతున్నా తీయలేదు. రాత్రి వరకు అంతటా వెతికారు. చివరకు వారి పత్తి పొలంలోనే ఉండటాన్ని గుర్తించి వెంటనే చేవెళ్లలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. హరీశ్వర్రెడ్డి ఆత్మహత్య చేసుకున్న చోట ఓ సూసైడ్ నోట్, పరుగుల మందు డబ్బా ఉన్నట్లు గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం చేవెళ్ల ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంసభ్యులకు అప్పగించారు.