ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

22 Oct, 2018 07:43 IST|Sakshi
ఆసుపత్రి వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు తోటలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు

శ్రీకాకుళం, టెక్కలి రూరల్‌: మండలంలోని గూడేం గ్రామానికి చెందిన వారణాసి అప్పన్న(23) ఆదివారం వేకువజామున తమ టేకు తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతడి తల్లిదండ్రులు రాము, రమణమ్మ, అక్క లలితల కథనం మేరకు.. మృతుడు అప్పన్న ఐటీఐ చదువుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇంటి దగ్గరే ఉంటున్న క్రమంలో ఓ వివాహితతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ విషయం ఆ మహిళ బంధువులకు తెలియడంతో ఇతడిని మూడ్రోజులుగా వేధించడంతోపాటు దాడి చేశారు. లక్ష రూపాయల అపరాధ రుసుము విధించారు.

ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామస్తులు సమక్షంలో ఈ తగాదాను పరిష్కరించనున్న క్రమంలో ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి రమణమ్మ హైదరాబాద్‌లో వలస కూలీగా పనిచేస్తోంది. దసరా సందర్భంగా మూడ్రోజుల క్రితమే గ్రామానికి వచ్చింది. ఇంతలోనే కుమారుడు దారుణానికి ఒడిగట్టడంతో బోరుమని విలపించింది. అయితే తన కుమారుడిది ఆత్మహత్య కాదని, గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు టెక్కలి ఎస్‌ఐ సురేష్‌బాబు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు