అమ్మాయి ఫొటోలు తీశాడని దాడి.. 

2 Apr, 2018 10:01 IST|Sakshi
ప్రభాకర్‌ (ఫైల్‌)

 మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యాయత్నం 

 చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి

చేవెళ్ల: తమ అమ్మయితో ఎందుకు చనువుగా ఉన్నావు, ఫొటోలు ఎందుకు తీశావని కుటుంబీకులు ఓ యువకుడిపై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కతనం ప్రకారం.. చేవెళ్ల మండలంలోని తంగడపల్లి గ్రామానికి చెందిన తెలుగు మల్లయ్య కొడుకు ప్రభాకర్‌ (22) శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాడు. ప్రతిరోజు గ్రామం నుంచి కళాశాలకు వెళ్లి వస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరికొందరు సైతం శంకర్‌పల్లిలోని వివిధ పాఠశాలలకు వెళ్తున్నారు. అయితే, ప్రభాకర్‌ వీరిలో ఓ అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని, మార్చి 28న బాలిక ఫొటోలు తీశాడని ఆమె కుటుంబీకులు మరుసటి రోజు అతడిని పిలిపించి దాడి చేశారు.

దీంతో మనస్తాపం చెందిన యువకుడు విషయం కుటుంబసభ్యులకు చెప్పి బాధపడ్డాడు.  గ్రామంలో పంచాయతీ పెట్టి మాట్లాడుదామని ప్రభాకర్‌కు తండ్రి నచ్చజెప్పాడు. అయితే, మార్చి 30న ఉదయం పొలానికి వెళ్లిన యువకుడు పురుగుల మందు తాగాడు. తనపై దాడి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులకు ఫోన్‌ చేశాడు. వెంటనే వారు పొలానికి వెళ్లి ప్రభాకర్‌ను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రభాకర్‌ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు బాలిక తండ్రి సత్యనారాయణరెడ్డితో పాటు  ఆయన సోదరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ గురువయ్య తెలిపారు.   
 

మరిన్ని వార్తలు