స్నేహితుడు లేని లోకంలో ఉండలేక.. 

9 May, 2018 13:34 IST|Sakshi
వినోద్‌ మృతదేహం

 వారం క్రితం యాక్సిడెంట్‌లో మిత్రుడి మృతి

మనోవేదనకు గురైన యువకుడు

ఇంట్లో ఉరేసుకున్న వైనం

రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయిలో ఘటన 

రామారెడ్డి(ఎల్లారెడ్డి) : వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఊరు వేరైనా ఎప్పుడూ కలిసే ఉండే వారు. వారం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం వారిద్దరిని విడదీసింది. మిత్రుడు చనిపోవడంతో కుంగిపోయిన యువకుడు మంగళవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్‌ లోని ఎల్లారెడ్డి మండలంలోని ఉప్పల్‌వాయిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఉప్పల్‌వాయి గ్రామానికి చెందిన గాంధారి వినోద్‌ (19), రామారెడ్డి గ్రామానికి చెందిన ఉస్కే సందీప్‌ ప్రాణ స్నేహితులు.

అయితే, వారం క్రితం రామారెడ్డి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ దుర్మరణం చెందాడు. మిత్రుడి మరణంతో వినోద్‌ కుంగిపోయాడు. వారం నుంచి తిండి తినడమే మానేశాడు. మనోవేదనకు గురైన అతడ్ని తల్లి ఎంతగా ఓదార్చింది.

కానీ, సందీప్‌ను తలచుకుంటూ రోజూ తల్లడిల్లి పోయేవాడు. తల్లి మంగళవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్లి, వినోద్‌ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చి చూసే వరకూ వేలాడుతూ కనిపించడంతో ఆమె గుండెలు బాదుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు