విధి పరీక్షలో ఓడి..

28 Feb, 2018 11:35 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముంజేటి పోతురాజు (ఇన్‌సెట్‌) రాజు (ఫైల్‌)

టెట్‌కు వెళ్తూ.. అనంతలోకాలకు

బొర్రమ్మగెడ్డ వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డున పడిన పేద కుటుంబం

స్వప్నం చెదిరిపోయింది.. ఆశలు ఆవిరయ్యాయి..రోజులు బాగుపడతాయన్న నమ్మకం వమ్ము అయింది..ఉద్యోగం వస్తే కుటుంబ పరిస్థితులు చక్కబడతాయన్న వారి ఎదురుచూపులు నిరర్థకమయ్యాయి..పేదరికాన్ని ఎదిరించి జీవనపోరాటం చేస్తున్న ఆ కుటుంబం చివరకు విధి పరీక్షలో చిక్కుకుని విషాదసాగరంలో మునిగిపోయింది. టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రాసేందుకు వెళ్తున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు పొట్టన పెట్టుకుంది. అతడి కుటుంబాన్ని వీధిపాలుజేసింది.

సబ్బవరం(పెందుర్తి):   జిల్లాలోని మాకవరపాలెం మండలంలోని పైడిపాల గ్రామానికి చెందిన ముంజేటి పోతురాజు(34), అదే మండలంలోని చినరాజుపల్లికి చెం దిన దుంగల నాగరాజు(34)   స్నేహితులు. వీరిద్ద రూ ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసి బతుకు తెరువు కోసం మాకవరంలోని అన్‌రాక్‌ అల్యూమినియం కంపెనీలో పనిచేస్తున్నారు. చినముషిడివాడలోని ఆయాన్‌ డిజిటల్‌ జోన్‌ పరీక్షా కేంద్రంలో  టెట్‌(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రాసేందుకు కోటి ఆశలతో వీరిద్దరూ మంగళవారం ఉదయం బైక్‌పై బయలుదేరారు.

సబ్బవరం మండలం ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై బొర్రమ్మగెడ్డ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో పెందుర్తి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న వ్యాన్‌ వీరి వాహ నాన్ని ఢీకొంది. దీంతో వాహనంపై వెనుక కూర్చున్న పోతురాజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందగా, వాహనం నడుపుతున్న దుంగల నాగరాజు స్వల్పగాయాలతో బయటపడ్డా డు. ఎస్‌ఐ ఎన్‌.ప్రభారరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. పోతురాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

పైడిపాలలో విషాదం
మాకవరపాలెం: టెట్‌ రాసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముంజేటి పోతురాజు(34)స్వగ్రామమైన పైడిపాలలో విషాదఛాయలు అలముకున్నాయి. పోతురాజు మరణవార్త వినగానే కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బీఈ డీ పూర్తి చేసిన పోతురాజు అన్‌రాక్‌లో ప్రోసెస్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి  మే14, 2015లో వివాహం జరిగింది. పోతురాజుకు భార్య సుధామాధురి, ఏడాదిన్నర పాపతో పాటు తల్లి, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. భార్య, తల్లి ఇతనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.  

తల్లి రెక్కల కష్టంతోనే చదువు..
18 ఏళ్ల క్రితం తండ్రి మృతి చెందడంతో ఏ ఆధారం లేని తల్లి మంగమ్మ కూలి పనులు చేస్తూ పోతురాజును చదివించింది. చిన్నపాటి ఉద్యోగం చేస్తున్న ఇతడి కష్టంతోనే కుటుంబ పోషణ జరుగుతోంది. ఇంతలో రోడ్డు ప్రమాద రూపంలో మృత్యు వు పోతురాజును కబళించడంతో ఈ కుటుంబానికి దిక్కుతో చని పరిస్థితి ఏర్పడింది. వివాహమైన రెండేళ్లకే భర్తను కోల్పోయిన భార్య, ఏడాదిన్నరకే తండ్రి ఆలనకు దూరమైన ఆ చిన్నారిని చూసిన వారంతా కంటతడి పెట్టారు. మృతుడి నివాసం వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. 

మరిన్ని వార్తలు