పాట వింటూ.. ప్రాణాలే కోల్పోయాడు..

27 Nov, 2019 04:58 IST|Sakshi

రైలు ఢీకొని యువడికి దుర్మరణం 

ఇయర్‌ఫోన్‌ పెట్టుకుని పట్టాలు దాటుతుండగా ప్రమాదం 

ధర్మవరం టౌన్‌: ఇయర్‌ ఫోన్‌ పెట్టుకుని ఎంచక్కా పాటలు వింటూ నడుస్తున్నాడు.. అంతలోనే రైలు పట్టాలు.. సంగీతాస్వాదనలో మైమరచిపోయిన ఆ యువకుడికి రైలు వస్తున్న శబ్ధం వినిపించలేదు. సరిగ్గా పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టి దుర్మరణం పాలయ్యాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పాతకుంట రైల్వేగేట్‌ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని జోగోనికుంటకు చెందిన రమణారెడ్డి, లక్ష్మీదేవిల కుమారుడు సాయికుమార్‌రెడ్డి(21).

ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో కర్రీస్‌ తీసుకొచ్చేందుకని వెళ్లి ప్రమాదం బారినపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బయటకు వెళ్లిన సాయికుమార్‌ ఎంతకూ రాకపోవడంతో బంధువులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో రైల్వే సిబ్బంది రాత్రి 12 గంటల ప్రాంతంలో పట్టాల వద్ద మృతదేహాన్ని గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడి చెవిలో ఇయర్‌ఫోన్‌ ఇరుక్కుపోయి ఉంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు