పట్టాలపై ప్రేరణకర్త మృతదేహం
భువనేశ్వర్(ఒడిశా): స్థానిక లింగరాజ్ ఆలయం సమీపంలోని రైల్వే ట్రాక్పై యువకుడు ఆదిత్యదాస్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన ప్రేరణాత్మక వక్త(మోటివేషనల్ స్పీకర్)గా ఇటీవల పేరొందిన ఆయన.. పీపుల్ ఫర్ సేవా పేరుతో వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు. అనతి కాలంలో ఈ కేంద్రంలో 100 మంది వయో వృద్ధులకు ఆశ్రయం కల్పించారు. అయితే మంగళవారం ఉదయం ఆయన మృతదేహం పట్టాలపై పడి ఉన్నట్లు గమనించిన స్థానికులు.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పూర్వాపరాల పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మానసిక స్థైర్యం పట్ల పలు ప్రేరణాత్మక సందేశాలను సాంఘిక మాధ్యమాల్లో ప్రసారం చేసి, ఉత్తమ వక్తగా పేరొందిన వ్యక్తి.. ఇలా ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని స్థానికులు భావిస్తున్నాయి. గత నెల 9న ఆదిత్య దాస్కు వివాహం జరిగింది.