చేతికందిన కొడుకు పాముకాటుకు బలి

15 Jun, 2020 13:42 IST|Sakshi
రవితేజ (పైల్‌)

 హుజూరాబాద్‌లో విషాదం

మిన్నంటిన కుటుంబసభ్యుల రోదనలు

హుజూరాబాద్‌రూరల్‌: చేతికందిన కొడుకు పాముకాటుకు బలికావడంతో తల్లిదండ్రుల రోదనలు మి న్నంటాయి. గ్రామస్తులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం..హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌ గ్రామానికి చెందిన పోలోజు వీరచారి–వనజకు ఇద్దరు సంతానం. కుమారుడు పోలోజు రవితేజ అలియాస్‌ రాజు(21), కుమార్తె సులోచన ఉన్నారు. వృత్తిరీత్యా వీరచారి గ్రామంలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన కుమారుడు పోలోజు రవితేజ ఇటీవల డిప్లొమా పూర్తిచేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు దినసరి కూలీ పనులు చేస్తూ అండగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శనివారం తన ఇంటికి సమీపంలో నాగరాజు అనే మిత్రుడు రవితేజకు ఫోన్‌చేసి ఇంటికి రమ్మని చెప్పడంతో వెళ్లాడు.

వర్షం వచ్చేలా ఉందని గడ్డి కుప్పలు పైకివేద్దామని నాగరాజు తండ్రి గుండేటి మహాదేవ్‌ చెప్పడంతో నాగరాజు, రవితేజ, నాగరాజు తండ్రి మహదేవ్‌లు గడ్డికుప్పలు పైకి వేస్తుండగా గడ్డికట్టల కింద ఉన్న పాము రవితేజను మూడుసార్లు కాటేయడంతో అతడు గట్టిగా కేకలు వేశాడు. వెంటనే నాగరాజు, అతడి తండ్రి చికిత్స నిమిత్తం హుటాహుటిన హుజూ రాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా గంటపాటు చికిత్స అందించిన వైద్యులు..పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించాలని సూచించారు. రవితేజను వరంగల్‌ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు తెలి పారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకొని ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో వారి రోదనలు కంటతడి పెట్టించా యి. జరిగిన సంఘటనపై మృతుడి తండ్రి వీరచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ మాధవి తెలిపారు.

మరిన్ని వార్తలు