ప్రాణం తీసిన ఫోన్‌ గొడవ

23 Oct, 2018 10:40 IST|Sakshi

యువకుల మధ్య ఘర్షణ ఒకరి మృతి

మరో ఇద్దరికి తీవ్రగాయాలు  

పోలీసుల అదుపులో నిందితుడు  

జవహర్‌నగర్‌: ఫోన్‌ కాల్‌ విషయమై కొందరు యువకుల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీయడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని యాప్రాల్‌ జెజె నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సీఐ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాప్రాల్‌లోని ఇందిరానగర్‌ చెందిన జైకుమార్‌ మీరాభాయ్‌కి ముగ్గురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు విక్రమ్, మరో కుమారుడు విక్కి అలియాస్‌ చెన్నారెడ్డి(29)లు ఆదివారం రాత్రి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గా మాత విగ్రహా ఊరేగింపునకు వెళ్లారు.

అనంతరం విక్రమ్‌ ఇంటికి తిరిగి రాగా విక్కి తన స్నేహితులు జోసఫ్, క్రిష్ణ, వికాస్‌తో కలిసి జెజెనగర్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌ ఇంటికి వెళ్లి తమ వదిన ఫోన్‌కు ఎందుకు ఫోన్‌ చేస్తున్నావని నిలదీయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో విక్కి శ్రావణ్‌ తలపై కొట్టడంతో అతడికి గాయమైంది. దీం తో ఇంట్లోకి వెళ్లిన  శ్రావణ్‌ కూరగాయల కోసే కత్తి తీసుకువచ్చి విక్కీపై దాడి చేయడంతో అతను కుప్పకూలాడు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన వికాస్‌పై కూడా దాడి చేశాడు. దీంతో అతను విక్కి సోదరుడు విక్రమ్‌కు సమాచా రం అందించడంతో విక్రమ్‌ అక్కడికి చేరుకున్నా డు. ఆగ్రహంతో ఉన్న శ్రావణ్‌ అతడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. విక్కీని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు విక్కి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విక్రమ్,వికాస్‌లను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.  సంఘ టనా స్ధలాన్ని మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, జవహర్‌నగర్‌ సీఐ సైదు లు పరిశీలించారు. నిందితుడు శ్రావణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు  మృతుడి తల్లి మీరాభాయ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు