లక్నో : టిక్టాక్ మోజు మరో నిండు ప్రాణాన్ని బలికొంది. తండ్రి తుపాకితో టిక్టాక్ వీడియో చేస్తూ అది పేలి ఓ 18ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నావాబ్జంగ్ జిల్లాలోని బుదియా భైకాంమ్పూర్కు చెందిన వీరేంద్ర కుమార్ అనే ఆర్మీ అధికారి కుమారుడు కేశవ్(18) తుపాకితో టిక్టాక్ వీడియో చేయాలనుకున్నాడు. తండ్రి తుపాకి ఇవ్వాలంటూ తల్లిని పోరు పెట్టాడు. దీంతో ఆమె కుమారుడికి తుపాకి ఇచ్చింది. దీంతో అతడు వీడియో చేయటానికి ఓ గదిలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత పెద్ద శబ్ధం రావటంతో ఆమె అతడి రూం దగ్గరకు వెళ్లింది. ఆ వెంటనే గాయంతో పడిఉన్న కుమారుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు.
కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కేశవ్ తల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు పంపటానికి నిరాకరించారు. తమకు పోలీసుల సహాయం అవసరం లేదని వారు చెప్పటం గమనార్హం. దీనిపై హఫిజ్గంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేశ్ పాల్ సింగ్ మాట్లాడుతూ.. మృతదేహం వద్ద ఎలాంటి సూసైడ్ లెటర్ దొరకలేదన్నారు. టిక్ టాక్ వీడియో రికార్డ్ చేస్తుండగా తమ కుమారుడు ప్రమాదానికి గురైనట్లు మృతుడి తల్లిదండ్రులు తెలిపారన్నారు. ఎలాంటి పోస్ట్మార్టమ్ లేకుండానే మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తిచేసినట్లు తెలిపారు.