హత్యకు దారితీసిన స్వలింగ సంపర్కం

1 May, 2019 17:37 IST|Sakshi

కోల్‌కత్తా : స్వలింగ సంపర్కం ఓ పసి బాలుడి హత్యకు దారితీసింది. బాలుడి తండ్రి తనను పట్టించుకోవటం లేదన్న కోపంతో చిన్నారిని గొంతునులిమి చంపేశాడో యువకుడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కాశీపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భాంగోర్‌లోని కాశీపూర్‌కు చెందిన సఫివుల్‌ మోలా అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో స్వలింగ సంపర్కం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి ఆ వ్యక్తి తనను పట్టించుకోవటం లేదని మోలా ఆగ్రహించాడు.

ఆవేశంలో ఆ వ్యక్తి కుమారుడైన ఆరేళ్ల బాలుడ్ని గొంతు నులిమి చంపి, ఇంటికి దూరంగా పడవేశాడు. విషయం తెలుసుకుని, కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి తల్లిని విచారించగా.. మోలాకు తన భర్తకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె బయటపెట్టింది. అతడిపైన తనకు అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. దీంతో మోలాను అదుపులోకి తీసుకుని, విచారించగా తనే ఈ హత్య చేసినట్లు మోలా ఒప్పుకున్నాడు.

మరిన్ని వార్తలు