పెళ్లింట విషాదం..తల్లి కళ్లెదుటే..

25 Apr, 2019 08:09 IST|Sakshi
మృతిచెందిన శ్రీనివాసరావు(ఫైల్‌), ఎం.డోలపేటలో శ్రీనివాసరావు స్వగృహం వద్ద విషాద వదనంలో కుటుంబ సభ్యులు.

రేగిడి: మరికొద్ది రోజుల్లో చెల్లికి పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాలన్న ఆ అన్న, తల్లిదండ్రులు కన్న కలలు కల్లలయ్యాయి. మే 16వ తేదీన చెల్లెలు కృష్ణవేణికి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లు అన్ని సక్రమంగా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పిడుగులాంటి వార్త ఆ గ్రామానికి అందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు సోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే. మండల పరిధిలోని ఎం.డోలపేటకు చెందిన బూరి శ్రీనివాసరావు (25) తన తల్లి కృష్ణవేణితో కలిసి విజయవాడ పెళ్లి కార్డులు పంచేందుకు బయలుదేదారు. విజయనగరం జిల్లా చీరుపల్లిలో రైలు ఎక్కారు. విశాఖపట్నం జిల్లా మర్రిపాలెం రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రమాదవశాత్తూ రైలు నుంచి  శ్రీనివాసరావు జారిపడి మృతిచెందారు. తండ్రి సూర్యనారాయణ, మామయ్య, బంధువులంతా హనుమాన్‌ జంక్షన్‌లోనే ఉంటున్నారు.

పెళ్లికి సంబంధించిన విషయాల గురించి చర్చించేందుకు తల్లిని కూడా తీసుకువెళ్తున్నారు. మార్గమధ్యంలోనే ఈ ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కృష్ణవేణి, సూర్యనారాయణలకు కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె సత్యవతి ఉన్నారు. అందరిలో కలుపుగోరుగా ఉంటూ తన చెల్లెల పెళ్లిని వైభవంగా చేయాలని గ్రామంలోని యువకులందరికీ ఇప్పటికే శ్రీనివాసరావు చెప్పాడు. తాను విజయవాడ వెళ్తున్నానని, తిరిగి రెండు రోజుల్లో ఊరికి చేరుకుంటానని, ఆ తర్వాత అందరూ కలిసి పెళ్లి వేడుకలకు సహకరించాలని అభ్యర్థించిన విషయాన్ని గుర్తుచేసుకుని స్నేహితులు, గ్రామస్తులు విలపిస్తున్నారు. మండలంలోని పాతచెలికానివలసలో చెల్లెల వివాహం జరగాల్సి ఉంది. విషయం తెలుసుకున్న చెల్లెలు అత్తింటి వారు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. గ్రామస్తులు, బంధువులు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు.

>
మరిన్ని వార్తలు