ప్రేమించలేదన్న కోపంతో నడిరోడ్డుపై యువతిని..

5 Aug, 2018 11:59 IST|Sakshi
ప్రాచీ జేడ్‌

థానే : ప్రేమించలేదన్న ఆగ్రహంతో యువతిని పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడో యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. థానేకు చెందిన ప్రాచీ జేడ్‌(20) అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన ఆకాష్‌ పవార్‌(25) గతకొద్ది నెలలుగా ప్రేమించమని వెంటబడుతూ వేధిస్తున్నాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోగా తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పటంతో వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆకాష్‌ను ఇకపై అలాచేయవద్దని మందలించి పంపేశారు. అయినా ఆకాష్‌ పద్దతిలో మార్పు రాకపోగా ఆమెపై ధ్వేషం పెంచుకున్నాడు. ఆమె తనను ప్రేమించటానికి ఒప్పుకోకపోతే హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు.

శుక్రవారం పక్కా ప్లాన్‌ ప్రకారం రెండు కత్తులను వెంటతీసుకొని వెళ్లి ఆమె ఇంటి దగ్గర వేచిచూశాడు. ఆమె ఓ పనిమీద స్కూటిపై బయటకు వెళుతున్న సమయంలో వెంబడించి ఈస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్దకు రాగానే స్కూటిని ఆపాడు. ఆమెను తిడుతూ ప్రేమను అంగీకరించాలని డిమాండ్‌ చేశాడు. అందుకు ఆమె బదులు చెప్పకపోవటంతో అందరూ చూస్తుండగానే వెంటతెచ్చుకున్న కత్తితో పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. అక్కడి వారు రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. మార్గం మధ్యలో ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ శనివారం స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్న నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు