ఇద్దరు యువకుల పాశవిక చర్య

28 Aug, 2019 08:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : తన మేనకోడలిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చాడో యువకుడు. మృతుడి ముఖాన్ని కూడా గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా కాల్చి పాశవికంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నివారాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.... ప్రమోద్‌(20) అనే వ్యక్తి మేనకోడలు, వారి దూరపు బంధువు అంకిత్‌ అనే యువకుడు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్‌.. మేనకోడలికి దూరంగా ఉండాల్సిందిగా అంకిత్‌ను హెచ్చరించాడు. అదేవిధంగా అతడి తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పి కొడుకును మందలించాలని సూచించాడు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని కోపోద్రిక్తుడైన ప్రమోద్‌.. అంకిత్‌ అడ్డుతొలగించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు ప్రకాశ్‌(22)తో కలిసి అంకిత్‌ హత్యకు పథకం రచించాడు. ఇందులో భాగంగా హర్యానాలో ఉద్యోగం చేస్తున్న అంకిత్‌కు ఆగస్టు 23న ఫోన్‌ చేసి యూపీకి రప్పించాడు. అదేరోజు పార్టీ చేసుకుందామని చెప్పి ప్రమోద్‌, ప్రకాశ్‌లు అంకిత్‌ను ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్లారు. అనంతరం అంకిత్‌తో మద్యం తాగించి వెంట తెచ్చుకున్న నాటు తుపాకీలతో కాల్చి అతడి ముఖాన్ని ఛిద్రం చేశారు. తర్వాత శవాన్ని అక్కడే పడేసి ఢిల్లీకి పారిపోయారు. 

కాగా ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఫ్యాక్టరీ దగ్గర మనిషి శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు అంకిత్‌ మృతదేహం గురించి ఎలాంటి ఆనవాలు దొరకలేదు. ముఖం గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఛిద్రం కావడం, శరీరమంతా పురుగులతో నిండిపోవడం, ఓ కాలును తిన్న జంతువులు సగం కాలును అక్కడే వదిలేసి వెళ్లడం వంటి భయానక స్థితిలో ఉన్న అంకిత్‌ శవాన్ని గుర్తించడం వారికి సవాలుగా మారింది. మరోవైపు అతడు హర్యానాలో ఉద్యోగం చేస్తుండటంతో తల్లిదండ్రులకు కూడా అతడు యూపీకి వచ్చిన విషయం తెలియదు. దీంతో మిస్సింగ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఈ క్రమంలో అంకిత్‌ కాల్‌డేటా ఆధారంగా విచారణ జరుపగా అసలు నిజాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని ద్వారకాలో తలదాచుకున్న ప్రమోద్, ప్రకాశ్‌లను సోమవారం అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా వారిద్దరు నేరాన్ని అంగీకరించినట్టు పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు