క్రికెట్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి

15 May, 2019 03:39 IST|Sakshi
అఖిల్‌గౌడ్‌ (ఫైల్‌)

డబ్బు చెల్లించలేని స్థితిలో ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం రూరల్‌: క్రికెట్‌ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో ఓడిపోయి డబ్బులు చెల్లించలేనిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తుర్కయంజాల్‌ గ్రామానికి చెందిన పలుస దాసుగౌడ్‌ కుమారుడు అఖిల్‌గౌడ్‌(21) నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతను వారంరోజులుగా కళాశాలకు వెళ్లి వచ్చి ఏకాంతంగా ఉంటున్నాడు. రెండురోజుల నుంచి అఖిల్‌గౌడ్‌ వద్ద ఉన్న ఫోన్‌ పోయింది.

పోన్‌ ఎక్కడ పోయింది.. ఎవరికి ఇచ్చావని తండ్రి మందలించడంతో ఫ్రెండ్‌ దగ్గర ఉందని చెప్పాడు. మంగళవారం ఉదయం తండ్రి మరోమారు మందలించి ఫోన్‌ తీసుకురావాలని చెప్పాడు. దీంతో అఖిల్‌గౌడ్‌ ఇంట్లో మొదటి అంతస్తులో గల షట్టర్‌లోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుమారుడి మృతికి గల కారణాలపై తండ్రి ఆరా తీయగా ఇటీవల అఖిల్‌గౌడ్‌ ఐపీఎల్‌ బెట్టింగ్‌లో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బు చెల్లించకపోవడంతో ఫోన్‌ లాక్కున్నారని అతని స్నేహితుల ద్వారా తెలిసింది. దీంతో మనస్తాపానికిగురై అత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన కుమారుడి మృతి పట్ల పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని దాసుగౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు