లాడ్జిలో యువకుడి ఆత్మహత్య

13 Feb, 2018 06:15 IST|Sakshi
ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతున్న రవితేజ (ఇన్‌సెట్‌లో) రవితేజ (ఫైల్‌)

నాయుడుపేటటౌన్‌: పట్టణంలోని బైపాస్‌రోడ్డుపై ఉన్న ఓ లాడ్జిలో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు లాడ్జి నిర్వాహకులు సోమవారం సాయంత్రం గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు.. చీరాల పట్టణంలోని ఈపూరుపాళెంకు చెందిన ఎన్‌.రవితేజ (25) స్వరాజ్‌ ట్రాక్టర్ల కంపెనీలో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. నాయుడుపేట స్వరాజ్‌ ట్రాక్టర్‌ షోరూంలో విధులు నిర్వహిస్తూ ఈ నెల 5వ తేదీ నుంచి ఈ లాడ్జిలో ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ట్రాక్టర్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కే శ్రావణ్‌కుమార్‌తో కలిసి మధ్యాహ్నం ఒక సినిమా, రాత్రి సినిమాను వరుసగా చూసి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో లాడ్జిలోని గదికి చేరుకున్నాడు.

సోమవారం ఉదయం నుంచి ఫోన్‌ చేస్తున్నప్పటికీ సమాధానం లేకపోడంతో అనుమానంతో సాయంత్రం లాడ్జి వద్దకు వచ్చి పరిశీలించగా గదిలో తలుపు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండటాన్ని గుర్తించారు. ఈ విషయమై లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ మల్లికార్జునరావు, ఎస్సై రవినాయక్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గదిలో టీవీ ఆన్‌ చేసుకుని ప్లాస్టిక్‌ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. అయితే ఈ యువకుడు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైన కారణమా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గదిలో లభించిన అతని సెల్‌ఫోన్, డైరీ తదితరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం  నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు