వెల్దుర్తి(తూప్రాన్) : కుటుంబంలో ఏర్పడిన స్వల్ప విభేధాల కారణంగా మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాధకర ఘటన మండలంలోని మానెపల్లిలో చోటుచేసుకుంది. కళాశాలకని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తొమ్మిది రోజుల అనంతరం గ్రామ శివారులోనే శవమై కనిపించడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై గంగరాజు, బాధితులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్లమొల్ల సత్తమ్మ, యాదయ్య దంపతుల కుమారుడు సతీష్(22). అతడు నర్సాపూర్లో హాస్టల్లో ఉంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 11న లోక్సభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి వచ్చిన సమయంలో, గుడిసెలో ఎన్నేళ్లు ఉంటాం, పక్కా ఇళ్లు కట్టుకుందామంటూ తండ్రితో వాదించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పక్కా ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు లేవని, తరువాత కట్టుకుందామని తండ్రి సముదాయించాడు.
అనంతరం ఓటువేసి కళాశాలకు వెళ్తునన్నాని చెప్పి సతీష్ అదేరోజు ఇంటి నుంచి బయలుదేరాడు. మరుసటి రోజు అతడికి పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో ఆందోళన చెంది వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మేకల కాపరికి గ్రామశివారులో మృతదేహం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు మృతదేహం తన కుమారుడు సతీష్దిగా గుర్తించారు. శవం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి శవం పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో అతను ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గంగరాజు వెల్లడించారు. సంఘటనాస్థలంలో మృతుడి కుటుంబీకుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మృతుడి సోదరుడు సైతం గతంలో ప్రమాదవశాత్తు మరణించాడు.