యువకుడి అరెస్ట్, నగలు స్వాధీనం
బనశంకరి: కాబోయే భార్యకు నగలు కొనేందుకు ఓ యువకుడు జేబుదొంగగా మారి చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాలు... భట్కళ నివాసి షహీంపిర్జాదే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల భట్కళ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భార్యకు బంగారు ఆభరణాలు, స్కూటర్ కొనిపెట్టడానికి తనకు వచ్చే సంపాదన సరిపోదని భావించి జేబుదొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. భట్కళ నుంచి బెంగళూరు నగరానికి బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల జేబులు కొట్టేవాడు. ప్రగతి, శ్రీకుమారట్రావెల్స్ బస్సుల్లో కూడా మహిళల బ్యాగులు, పర్సులను దొంగలించాడు. పసిగట్టిన ట్రావెల్స్ యజమాని జేసీ.నగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు గురువారం షహింపిర్జాదేను అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 310 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.