మొబైల్‌ నెట్‌వర్క్‌ కోసం కొండెక్కితే..!

24 May, 2020 19:34 IST|Sakshi

కాల్పులు జరిపిన వేటగాడు

సాక్షి, కర్ణాటక: తగ్గు ప్రాంతంలోని ఇంట్లో మొబైల్‌ నెట్‌వర్క్‌ అందడం లేదని రాత్రి సమయంలో కొండ ఎక్కిన యువకున్ని అడవి జంతువు అని భావించి వేటగాడు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ తాలూకా కవలకొప్ప గ్రామం గొంటనాళకు చెందిన ప్రదీప్‌నారాయణ్‌గౌడ అనే యువకుడు తన ఊరిలో మొబైల్‌ నెట్‌వర్క్‌ రాలేదని శుక్రవారం రాత్రి సమీపంలోని కొండ ఎక్కాడు.

కొండపై నెట్‌వర్క్‌ అందుతుండటంతో మొబైల్‌ చూస్తూ రాతిపై కూర్చున్న యువకుడిని దూరం నుంచి గమనిస్తున్న వేటగాడు కవలకొప్ప గొంటనాళ రామకన్నానాయక్‌  ఏదో అడవి ప్రాణి అనుకుని తుపాకీతో కాల్చాడు. బుల్లెట్‌ యువకుని కుడికాలు, పొట్ట భాగంపై దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పై సమాచారం అందిన వెంటనే సిద్దాపుర పోలీసులు చేరుకుని పరిశీలించి బాధితున్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: అదనపు కట్నం కోసం పాముతో కాటేయించి..!

మరిన్ని వార్తలు