మద్యం మత్తులో ఎస్సైని దూషించి..వీరంగం

26 Nov, 2018 10:42 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వీరంగం సృష్టిస్తున్న నమ్కు 

నల్లబెల్లి: మద్యంమత్తులో పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఇద్దరు యువకులు శనివారం అర్థరాత్రి వీరంగం సృష్టించిన సంఘటన రూరల్‌ జిల్లా నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సై నరేందర్‌రెడ్డి పోలీస్‌ సిబ్బందితో కలిసి ఆదివారం అర్థరాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రాంతీర్థం శివారు బిల్‌నాయక్‌తండాకు చెందిన మాలోత్‌ నమ్కు, మాలోత్‌ రాజా రతన్‌సింగ్‌లతో పాటు మరికొందరు శనిగరం క్రాస్‌ రోడ్డు జాతీయ రాహదారి సమీపంలో పబ్లిక్‌ ప్లేస్‌లో మద్యం సేవిస్తూ కనిపించారు. పోలీస్‌ వాహనంలో ఎస్సైతో పాటు పోలీస్‌ సిబ్బంది అక్కడి వెళ్తున్న క్రమంలో కొందరు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నమ్కు, రాజారతన్‌సింగ్‌లు మాత్రం అక్కడే నిలుచున్నారు.

ఇంతరాత్రి ఇక్కడ ఎందుకు ఉన్నారని వారిని పోలీసులు ప్రశ్నిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో మద్యంమత్తులో ఉన్న యువకులు ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. పబ్లిక్‌ ప్లేసులో మద్యం తాగినందుకు కేసు నమోదు చేస్తామని ఎస్సై వారికి తెలియజేస్తూ అక్కడి నుంచి పోలీస్‌ స్టేషన్‌ వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీస్‌ వాహనాన్ని ద్విచక్రంపై వెంబడిస్తూ పీఎస్‌కు చేరుకొని సుమారు రెండుగంటల పాటు ఎస్సైతో పాటు పోలీసులపై పరుషపదజాలాన్ని ఉపయోగిస్తూ దూషించారు. ఎస్సై, పోలీసులు క్షమాపన చేప్పేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని హంగామ సృష్టించారు. ఫ్రెండ్లీ పోలీస్‌ కావడంతో చేసేది ఎమిలేక చూస్తూ ఉండి పోయారు.

కేసు నమోదు
స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో శనివారం రాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన  తెలిపిన వివరాల ప్రకారం.. బిల్‌నాయక్‌తండా గ్రామానికి చెందిన మాలోత్‌ నమ్కు, మాలోత్‌ రాజా రతన్‌సింగ్‌లు మద్యంమత్తులో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించారు.  దీంతో  కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

>
మరిన్ని వార్తలు