చండీగడ్ : ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను నడిరోడ్డుపై వెంటాడి కాల్చి చంపిన ఘోరఘటన కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో యువతి బంధువులే వారిని హతమార్చారు. ఈ ఘటన పంజాబ్లోని నౌషేరా గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమన్ప్రీత్ కౌర్(23) అనే అమ్మాయి అదే గ్రామాని చెందిన అమన్దీప్ సింగ్లు ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. వీరీ ప్రేమ వ్యవహారంపై ముందు నుంచి వ్యతిరేకంగా ఉన్న అమ్మాయి కుటుంబ సభ్యులు వారు వివాహం చేసుకొవడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో అదివారం ఈ జంట గురుద్వార బీర్ బాబా బుద్ధ సాహీబ్ను దర్శించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా అమ్మాయి బంధువులు వారిపై దాడి చేశారు.
ఆ జంట ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వారి వాహనంతో ఢీ కోట్టడంతో వారు కిందపడ్డారు. ఆ తర్వాత వారిని చూసి భయంతో పరుగులు తీస్తున్న ఆ దంపతులను వెంటాడి పలుమార్లు తుపాకితో కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నౌషేరా గ్రామంలో గత ఏడాది ఓ అమ్మాయి బంధువులు అబ్బాయి కుటుంబ సభ్యులు ముగ్గురిని హతామార్చారని, ఇప్పటికీ ఆ కేసుపై విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కోన్నారు.