గ్యాంగ్‌వార్‌కు యువకుడి బలి

28 Mar, 2019 06:44 IST|Sakshi
నదీమ్‌ (ఫైల్‌)

పలువురు యువకుల దాడి

తీవ్ర గాయాలతో చికిత్సపొందుతూ మృతి

ఎంఎంపహాడిలో విషాదం

రాజేంద్రనగర్‌: చిన్న విషయంలో మాటామాట పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. రాజేంద్రనగర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ఎంఎంపహాడీ ప్రాంతానికి చెందిన జాకీర్‌ ఈ నెల 25వ తేదీ సోమవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో నదీమ్‌ (25), రహీమ్‌ తమ బంధువుల విందుకు హాజరై వెళ్తున్నారు. వీరిద్దరూ జాబేర్‌ ఇళ్లు ఎక్కడని అక్కడ కూర్చున్న వారిని అడిగారు.

ఈ క్రమంలో వారి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. తనపై దాడి చేస్తున్నారంటూ తన స్నేహితులకు ఫోన్‌లో జాకీర్‌ సమాచారం అందించాడు. వెంటనే మరో ఐదు మంది యువకులు హాకీ స్టిక్స్, మారణాయుధాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికులు అప్పటికే యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆ వచ్చిన స్నేహితులు నదీమ్, రహీమ్‌పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కిందపడ్డ నదీమ్‌పై దాడి చేసి పక్కనే ఉన్న గనెట్‌ రాళ్లను వేశారు. వెంటనే వారందరూ పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నదీమ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి నదీమ్‌ మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం బుధవారం కుటుంబసభ్యులు మృతదేహ నికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా రాజేంద్రనగర్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.

మరిన్ని వార్తలు