యువతి ఆత్మహత్య

17 Aug, 2018 12:12 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న యువతి రాహీలా (ఫైల్‌)

వివాహం కాలేదని మనస్తాపం

కర్ణాటక, దొడ్డబళ్లాపురం : పాతికేళ్లు పైబడ్డా వివాహం కాలేదనే ఆవేదనతో యువతి నీటికుంటలో పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగల్‌కోట పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని హళేపెట నివాసి రాహీలా మనియార (28) స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంక్‌లో పనిచేస్తోంది. తన స్నేహితురాళ్లకు వివాహాలు జరిగిపోతుండడంతో బాగా మదనపడేది. బుధవారం సాయంత్రం పని ముగించుకుని రాహీలా ఇంటికి రాకుండా పట్టణ శివారులో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లి చెప్పులు, బ్యాగు కుంట గట్టుమీద వదిలేసి నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

రాత్రయినా కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లితండ్రులు తెలిసిన వారందరినీ అడిగారు. గురువారం ఉదయం నీటికుంటలో శవం తేలుతుండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వ్యానిటీ బ్యాగు పరిశీలించగా డెత్‌నోట్‌ దొరికింది. అప్ప, అమ్మ నన్ను క్షమించండి. .నా చావుకి ఎవరూ కారణం కాదు...మీ ముద్దుల కూతురు అని రాసింది. బాగల్‌కోట పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు