డ్రైవింగ్‌ నేర్చుకొంటూ యువతి దుర్మరణం

30 Jul, 2018 12:40 IST|Sakshi
పావని మృతదేహం

ఆరిలోవ(విశాఖ తూర్పు): డ్రైవింగ్‌ నేర్చుకొంటూ డివైడర్‌ని ఢీకొని ఓ యువతి మృతి చెందిన సంఘటన ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
చినవాల్తేరు ప్రాంతానికి చెందిన పావని(16) నగరంలోని రామాటాకీస్‌ దరి మహవీర్‌ బుక్‌ షాపులో పనిచేస్తుండేది. ఆమెకు ఆరిలోవ ప్రాంతం జైభీమ్‌ నగర్‌కు చెందిన కిరణ్‌తో పరిచయమైంది. కిరణ్‌ ఆమెకు బైక్‌ డ్రైవింగ్‌ నేర్పడానికి ఆదివారం ఉదయం బీచ్‌రోడ్డులో రుషికొండ తీసుకెళ్లాడు. బీచ్‌ రోడ్డులో డ్రైవింగ్‌ నేర్చుకొనే క్రమంలో బేపార్కు వద్ద మలుపులో ఆమె నడుపుతున్న బైక్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆమెకు పొట్టలో బలమైన గాయమైంది. అదే సమయంలో నడకకోసం వెళ్లిన వారు 108కి సమాచారం అందించి కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. పావని పెదనాన్న పీలా రమణ ఫిర్యాదు మేరకు ఆరిలోవ ఏఎస్‌ఐ బ్రహ్మాజీ  కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు