వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని..

8 Sep, 2019 08:38 IST|Sakshi

కర్మాగారంలో ప్రమాదం

సాక్షి, కడప : కడప నగర శివార్లలోని ఓ ప్రైవేటు కర్మాగారంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందగా, మరో యువతి తీవ్రంగా గాయపడింది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప రిమ్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బహుజననగర్‌లో నివసిస్తున్న గంగాదేవి, హరిచరణ్‌లకు జమున, గాయత్రి, మాధవచరణ్‌లు సంతానం. గాయత్రి గత ఏడాది నుంచి ప్రైవేటు కర్మాగారంలో మిషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తోంది.

రోజు మాదిరిగానే శనివారం ఉదయం తాను పనిచేస్తున్న కర్మాగారంలో మిషన్‌ ఆపరేటింగ్‌ చేస్తుండగా తాను వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని ఆమె దాంతో పాటు గిరగిరా తిరిగింది. మరో యువతి అరుణ (19) ఆమెను రక్షించడానికి వెళ్లి తాను చేయిని పోగొట్టుకుని తీవ్రంగా గాయపడింది. గాయత్రిని రిమ్స్‌కు హుటాహుటిన తీసుకెళ్లగానే పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మరో యువతి అరుణ(19)  తీవ్రంగా గాయపడటంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటనపై రిమ్స్‌ ఎస్‌ఐ సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు