ప్రాణం తీసిన సెల్ఫీ

6 Nov, 2019 11:21 IST|Sakshi
మెర్సీ (ఫైల్‌)

వివాహం నిశ్చయమైన యువతి మృతి

చెన్నై, అన్నానగర్‌: ఆవడి సమీపం సోమవారం బావి రక్షణ గోడ ఆనుకుని సెల్ఫీ తీసుకుంటూ బావిలో జారిపడి యువతి మృతి చెందింది. ఆమెని కాపాడటానికి బావిలో దూకిన యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాలు.. ఆవడి సమీపం పట్టాభిరామ్, నవజీవన్‌ నగర్‌కు చెందిన దాస్‌. ఇతని కుమారుడు అప్పు (24). పట్టాభిరామ్‌ గాంధీ నగర్‌ 1వ వీధికి చెందిన థామస్‌ కుమార్తె మెర్సీ (22). బంధువులైన వీరిద్దరు అంబత్తూర్‌ ఎస్టేట్‌లోని ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేస్తున్నారు. సెప్టెంబర్‌లో వీరికి నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వివాహం జరగాల్సి ఉంది.

సోమవారం సాయంత్రం అప్పు, మెర్సీ పని ముగించుకుని ఇంటికి వచ్చే దారిలో ముత్తాపుదుపేట సమీపంలో పొలం బావి గోడ మీద ఆనుకుని సెల్ఫీ తీసుకుంటున్నారు. ఆసమయంలో రక్షణ గోడ విరిగి మెర్సీ బావిలో పడింది. ఆమెను కాపాడానికి అప్పు కూడా బావిలో దూకాడు. కానీ అంతలోనే మెర్సీ బావిలో మునిగిపోయింది. ఆమెను కాపాడలేక, బావి మెట్లు ఎక్కి వచ్చి కేకలు వేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మెర్సీ మృతదేహాన్ని పైకి తీసి పోస్టుమార్టం కోసం కీళ్‌పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు