తాళ్లూరు (ప్రకాశం): కుటుంబ సభ్యులు ఉద్యోగం వద్దన్నారని మనస్తాపంతో ఉరేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని తురకపాలెంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూరా చిన సుబ్బారెడ్డి, నాగులు దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె రాజేశ్వరి (23), కుమారుడు బ్రహ్మారెడ్డి. ఇద్దరూ ఉన్నత చదువులు చదివి హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల ఆహారం పడక, ఆరోగ్యం సక్రమంగా లేక పోవడంతో రాజేశ్వరి స్వగ్రామానికి వచ్చింది.
ఆ తర్వాత ఆరోగ్యం కొద్దిగా కుదుట పడటంతో ఉద్యోగానికి వెళ్తానని తల్లిదండ్రులతో చెప్పింది. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిన తర్వాత వెళ్లవొచ్చని తల్లిదండ్రులు చెప్పారు. ఇందుకు కుమార్తె ససేమిరా అంది. దీనికి మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజేశ్వరి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ రంగనాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.